GHMC క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తుల స్వీకరణ ▶️

త్రికాల తెలుగు : గ్రేటర్ హైదరాబాద్ : ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఉన్న కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళ వారం జూలై 21 2026 నుంచి  క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మీ సేవ, మీ సేవ వాట్సాప్‌లో “ఇందిరమ్మ ఇండ్లు” దరఖాస్తు సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన దరఖాస్తు సేవలను మీ సేవ, మీ సేవ వాట్సాప్ ద్వారా అధికారికంగా ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సులభంగా అర్హులైన వారందరూ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.

క్యూర్ పరిధిలో అర్హులైన పౌరులు ఈ సేవల ద్వారా తమ సమీపంలోని మీ సేవ కేంద్రం లేదా మీ సేవ వాట్సాప్ (8096958096) ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లు పథకానికి దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి మొదలౌతుంది. 21 జూలై 2026 నుండి ప్రారంభమై 10 ఆగస్టు 2026 వరకు కొనసాగుతుంది. అర్హులైన పౌరులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని ప్రభుత్వం కోరుతోంది.

మీ సేవ పోర్టల్ (meeseva.telangana.gov.in) లేదా మీ సేవ వాట్సాప్ ద్వారా పౌరులు ఇందిరమ్మ ఇండ్లు పథకానికి దరఖాస్తు చేసుకోవడం, తమ అప్లికేషన్ స్థితిని (Application Status) ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసే విధానం 1. మీ సేవ కేంద్రం ద్వారా: సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇండ్లు సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2. మీ సేవ వాట్సాప్ ద్వారా: 8096958096 నంబర్‌కు “Hi” లేదా సందేశం పంపి, చాట్‌బాట్ సూచనలను అనుసరిస్తూ నేరుగా మొబైల్ ఫోన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

మీ సేవ లేదా మీ సేవ వాట్సాప్ ద్వారా ఇందిరమ్మ ఇండ్లు సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల అర్హులైన లబ్ధిదారులకు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, పేపర్‌వర్క్ తగ్గి, దరఖాస్తు స్థితిని పారదర్శకంగా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను డిజిటల్, మొబైల్ వేదికల ద్వారా మరింత చేరువ చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మీసేవ ఉన్నతాధికారులు తెలిపారు. అర్హులైన పౌరులు నేటి నుంచి (21 జూలై 2026 నుండి 10 ఆగస్టు 2026 మధ్యలో) తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలని, దరఖాస్తు చేసే ముందు అవసరమైన పత్రాల స్కాన్ కాపీలు లేదా స్పష్టమైన ఫోటోలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

 

ట్రెండింగ్ న్యూస్