పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై..సీఎం ఎమర్జెన్సీ మీటింగ్

పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని శక్తులు (vested interests) రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆగస్టు 4 ( 2026 ) సాయంత్రం తర్వాత DGP సీవీ ఆనంద్ తో పాటు ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి నియామక ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పాదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. నియమ నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ట్రెండింగ్ న్యూస్